కెసిఆర్ తెరాసలోకి పిలిచారు, పరిశీలిస్తా: మందా
ఢిల్లీలో చక్కర్లు కొట్టడం మానేసి తమతో కలిసి రావాలని కెసిఆర్ బహిరంగంగానే బుధవారం పిలుపునిచ్చారు. కెవి రంగా రెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ ఆహ్వానం అందించారు. ఇటీవల ఢిల్లీలో కెసిఆర్ ముగ్గురు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మందా జగన్నాథం, రాజయ్య, వివేక్లతో సమావేశమయ్యారు. ఆ సమయంలో వదంతులు పెద్ద యెత్తున వ్యాపించాయి.
ఎఫ్డిఐలపై లోకసభలో ఓటింగు సందర్భంలో కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మానసికంగా సిద్ధం కావడం వల్లనే లోకసభకు గైర్హాజరవుతామని వారు చెప్పినట్లు భావిస్తున్నారు. దీంతో అప్పటికప్పుడు తెలంగాణపై డిసెంబర్ 28వ తేదీన తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రాంత పార్టీ సభ్యులను కాంగ్రెసు అధిష్టానం బుజ్జగించింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా కాలంగా వివేక్ గట్టిగా మాట్లాడుతున్నారు. దాదాపుగా ఆయన తెరాసలో చేరడానికే నిర్ణయించుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం అంగీకరించకపోతే తాము వేరే పార్టీలను చూసుకుంటామని నల్లగొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ మధ్య చెప్పారు.