నీటి కోసం పయ్యావుల దీక్ష: అక్కడే బ్రషింగ్, స్నానం
దీక్ష చేస్తున్న పయ్యావుల శుక్రవారం ఉదయం అక్కడే బ్రష్ వేసుకొని, స్నానం చేశారు. తాము నీటి కోసం ఇంతగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. ప్రకటన వచ్చే వరకు తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. పయ్యావుల అక్కడే దీక్షకు దిగడంతో పోలీసులు రాత్రి నుండి అక్కడే మోహరించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పయ్యావుల ఎంతకూ అక్కడ నుండి కదలక పోవడంతో పోలీసులు ఈ రోజు ఆయనతో మాట్లాడి చూశారు. కానీ ఆయన ససేమీరా అన్నారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత సద్దుమణిగింది. పయ్యావుల తన దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా నెలన్నర ముందుగా నీరు నిలిపివేయగా ఎస్ఈని కలువగా ఈ నెల 13 నుంచి తిరిగి విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ హామీ మేరకు గురువారం నీటిని విడుదల చేయకపోవడంతో మళ్లీ అనంతపురంలో ఎస్ఈని కలిశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో రాత్రి ఇక్కడికి చేరుకుని జిబిసి కాలువపై టెంటు ఏర్పాటు చేసుకుని నిరసన చేపట్టారు. రైతులు వేసిన మిర్చి, పత్తి, జొన్న పంటలు ఎండిపోతున్నాయంటూ ఆయన నిరసనకు దిగారు. ఆయనకు భారీగా రైతులు మద్దతు పలుకుతున్నారు.