శిక్షపడిన నార్వే దంపతుల్ని విడిచి పెట్టండి: కెఏ పాల్
అమ్మానాన్నల కోసం వారు ఏడుస్తున్నారని, బాధపడుతున్నారని, వారిని చూడాలని తపిస్తున్నారని పాల్ అన్నారు. నార్వే సర్కారు మానవత్వంతో స్పందించి వారి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాల్సిందిగా లేదా వారిని ఆ దేశం నుంచి పంపించేయాల్సిందిగా తాను కోరుతున్నానని చెప్పారు. కాగా ఓస్లో కోర్టులో శిక్ష పడిన తెలుగు దంపతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఓస్లో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు హైకోర్టుకు వెళ్లారు. తెలుగు దంపతులకు మంగళవారం ఓస్లో కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. చంద్రశేఖర్, అనుపమ దంపతులకు జైలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చంద్రశేఖర్కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష ఖరారు చేసింది. పిల్లలను మందలించారనే ఆరోపణలతో వారు జైలు పాలయ్యారు. ఆ దంపతులు తమ కుమారుడి ఒంటిని కాల్చారని పోలీసులు ఆరోపించారు. వారు తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు ఆరోపించారు.
పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు. కాల్పిన లోహంతో వాతలు పెట్టారని ఆ తెలుగు దంపతులు ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమ ఖండించారు. పిల్లలను వారు బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు గానీ బాధించలేదని, సహాయం కోసం వారు చూశారని, కానీ అది లభించలేదని అనుపమ తరఫు న్యాయవాది మార్టే బ్రోట్రోమ్ కోర్టు తీర్పునకు ముందు అన్నారు.
దంపతులను నార్వేలోని జైలులో పెట్టడం తప్పు అని ఆమె అన్నారు. కోర్టు వారికి శిక్ష వేస్తే తాము అపీల్ చేస్తామని ఆమె అన్నారు. పిల్లవాడు పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు చంద్రశేఖర్ను అరెస్టు చేశారు. కొడుకుని మందలించిన కేసులో తల్లి అనుపమకు 15 నెలలు, తండ్రి చంద్రశేఖర్కు 18 నెలలు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. దీనిని వారు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.