విజయమ్మ చెప్పాలి: హరీష్, ఎదుర్కోలేకే: సంకినేని
అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తెలంగాణ ప్రజల వైపు ఉంటారో, సమైక్యాంధ్ర పార్టీలో ఉంటారా తేల్చుకోవాలని ఆయన అన్నారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్న సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పకపోతే సమైక్యాంధ్ర పార్టీల దిమ్మలు గానీ జెండాలు గానీ ఉండనివ్వబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తం కావాలని తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. సీమాంధ్రులు ఈ ప్రాంతంలో అన్ని వనరులను కొల్లగొట్టారని, వారిని ఈ తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ఆమె అన్నారు.
కాగా, హరీష్ రావు వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సంకినేని వెంకటేశ్వర రావు ఖండించారు. కాంగ్రెసు వైఖరిని వెల్లడించకుండా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఖరిని అడగడం సరి కాదని ఆయన శనివారంనాడు అన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశానికి ముందే కాంగ్రెసు, తెరాస మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.
తమ పార్టీని ఎదుర్కోలేకనే హరీష్ రావు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై మొదట కాంగ్రెసు, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు.