హైకోర్టులో తెలంగాణ ఆందోళన: లాయర్ల విచారణకు ఓకే
కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్లలోని ఫర్నిచర్ను, లైట్లను ధ్వంసం చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు కూడా ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది. కోర్టు ధిక్కార కేసును సుమోటోగా నమోదు చేసి విచారణ జరుపుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. హైకోర్టులో జరిగిన ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సుప్రీం కోర్టు గతంలో ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో 24 మంది న్యాయవాదులపై ఐపిసిలోని సెక్షన్ 147, 506, 323, 186, 228, 153ఏ రెడ్విత్ 149, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ జివో ఆర్.టి. నెంబర్ 2348 జారీ అయింది.
హైకోర్టు న్యాయవాదులు భాగ్యమ్మ, మంజుల, వెంకట యాదవ్, భిక్షపతి, విప్లవ రెడ్డి, జలకం సంపత్, గోపిరెడ్డి చంద్రశేఖర రెడ్డి, పాశం కృష్ణా రెడ్డి, రాఘమ్మ, క్రిమినల్ కోర్టు న్యాయవాదులు బుచ్చిరెడ్డి, నాగుల శ్రీనివాస్, రాజవర్ధన్ రెడ్డి, సంపూర్ణ దేవి, వెంకటేష్, మానిక్ ప్రభు, మానిక్ రెడ్డి, సిటి సివిల్ కోర్టు న్యాయవాదులు అశోక్, సంతోష్ సింగ్, శశాంక్ గోయల్, చంద్రయ్య యాదయ్య, రూపాసింగ్, శ్రీనివాస్ గౌడ్, రవీంద్రనాథ్, రంగారెడ్డి జిల్లా లాయర్ చెన్నవీరయ్యలు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కాగా వీరు పరారీలో ఉన్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.