జగన్నుండి ప్యాకేజ్ తీసుకున్నా!: ప్రవీణ్, సోదరులారా..
తాను జగన్ నుండి ప్యాకేజీలు తీసుకున్నది నిజమేనని.. ప్రతి పేదవాడి మోమున చిరునవ్వును తీసుకు వస్తామని చెప్పిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాన్ని నెరవేర్చే ప్యాకేజీని, రైతాంగంలో కమ్ముకున్న కారుచీక్టలను తొలగిస్తామనే ప్యాకేజీని, వైయస్ మృతి తర్వాత నియోజకవర్గానికి హంద్రీనీవా ప్రాజెక్టు ఆగిపోయిందని, దానిని తీసుకు వచ్చే ప్యాకేజీని, మాసిన గడ్డంతో, మాసిన బట్టలతో ఉన్న రైతులకు అండగా నిల్చునే ప్యాకేజీని, నా నియోజకవర్గానికి తాగునీటిని తీసుకు వస్తాననే ప్యాకేజీని తీసుకున్నానని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ముప్పయ్యేళ్లుగా తమ కుటుంబం టిడిపి కోసం పని చేస్తోందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తమ కుటుంబానికి వెన్నంటి నిలిచారన్నారు. ఎన్టీఆర్ తర్వాత టిడిపిని కాపాడుకోవాలని చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి తాను ఆయనతో నడిచానని కానీ, అన్నీ మోసపూరిత మాటలు అన్నారు. ఎన్టీఆర్ తర్వాత వైయస్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. కాంగ్రెసుతో టిడిపి కుమ్మక్కై జగన్ను జైలుకు పంపించాయన్నారు.
ముప్పయ్యేళ్లుగా నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెసు పార్టీకి బుద్ధి చెబుతున్నా బాబు మాత్రం బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు. టిడిపిను ముందు ముందు పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాజన్న రాజ్యం తీసుకు వస్తామని జగన్, షర్మిలలు గట్టిగా చెబుతుంటే టిడిపి మాత్రం చంద్రన్న రాజ్యం అని అనడం లేదన్నారు. అంటే చంద్రబాబు పాలన ఆ పార్టీకే నచ్చలేదా అని ప్రశ్నించారు.
టిడిపి ముసుగుతో చంద్రబాబు చేసిన ప్రతి చర్యను తాను, అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించామన్నారు. మాలాంటి చిత్తశుద్ధి గల నేతలను వదులుకొని అమ్ముడుపోయే నేతలను చంద్రబాబు దగ్గరకు తీసుకుంటున్నారన్నారు. శిశుపాలిడి యొక్క నూరు తప్పులను కృష్ణుడు లెక్కించినట్లుగా ప్రజలు బాబు వెయ్యి తప్పులను ఓర్చుకొని 2014లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని కేంద్రం, రాష్ట్రం, బాబులు టార్గెట్ చేసుకున్నారని, దానికి తామంతా కలత చెందుతున్నామన్నారు.
వైయస్ కుటుంబాన్ని తొలగించాలనే వారి కుట్రలను తామంతా కలిసి సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. జగన్ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం ఓ లీడర్ అవసరమని అతనే జగన్ అన్నారు. బాబు మీడియా తనపై ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తోందని, వాటిని స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. జగన్ను సిఎంని చేసేందుకు కృషి చేస్తామని తాను విజయమ్మకు మాటిస్తున్నానన్నారు. కాగా ప్రవీణ్ కుమార్ రెడ్డి సోదరులారా అంటూ మాట్లాడారు.