యుఎస్ కాల్పులు: ఇంట్లోనే తల్లిని కాల్చేసిన ఉన్మాది
న్యూయార్క్: అమెరికాలోని పాఠశాలలో శుక్రవారం నరమేధం సృష్టించిన ఉన్మాది అంతకుముందే తన తల్లిని చంపి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఉన్మాది మొదట ఇంటి వద్దనే తన తల్లిని కాల్చి చంపాడు. అనంతరం ఆమెకు చెందిన మూడు తుపాకులను తీసుకొని న్యూటౌన్ నగరంలోకి శాండీ హుక్ పాఠశాలలో విద్యార్తులపై కాల్పులు జరిపాడు. ఇతను 20 ఏళ్ల ఆడం లాన్జాగా పోలీసులు గుర్తించారు.
మనోవైకల్యంతో బాధపడిన ఆడం... ఉపాధ్యాయురాలైన తన తల్లి నాన్సీతో కలిసి న్యూటౌన్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆమెను కాల్చిన చంపిన ఇతను తర్వాత పాఠశాలలోకి చొరబడి అయిదు నుండి పదేళ్ల లోపు చిన్నారులు 20 మంది సహా మొత్తం 28 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. వారిని కాల్చిన తర్వాత ఉన్మాది తనను తాను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆడం తల్లి నాన్సి ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.
ఆడంను అడ్డుకోవడానికి, పిల్లలను రక్షించడానికి యత్నించిన పాఠశాల ప్రిన్సిపల్ డాన్ హోచ్స్ప్రంగ్ను, సైకాలజిస్ట్ మార్చ్ సెరియాక్ను కూడా అతడు కాల్చి చంపేశాడు. తర్వాత విక్టోరియా సోటో అనే టీచర్ సహా నలుగురు సిబ్బందిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా రెండు రోజుల క్రితం అమెరికాలో గన్ కల్చర్ మరోసారి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కాల్పుల్లో అన్నెం పున్నెం ఎరుగని 28 మంది మరణించారు. మృతుల్లో 20 మంది పాపం పుణ్యం ప్రపంచమార్గం తెలియని చిన్నారులే. రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని వచ్చి విచక్షణారహితంగా ఓ 20 ఏళ్ల యువకుడు పాఠశాల తరగతి గదిలో కాల్పులు జరిపాడు. అతను పాఠశాల బయట ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.