3 నెలలు దాటింది: పరకాల ఎన్నికపై కెసిఆర్కు ఎర్రబెల్లి
టిడిపి డిమాండ్ చేయడం వల్లే అఖిల పక్షం ఏర్పాటు కోసం కేంద్రం తేదీని ప్రకటించిందన్నారు. చంద్రబాబు ఎప్పటి నుండో అఖిల పక్షం కోసం డిమాండ్ చేస్తున్నారని, ఇటీవల కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖపై నేటికీ తమ పార్టీ కట్టుబడి ఉందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెరాస నేతలు ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే పాకులాడుతున్నారని విమర్శించారు.
ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలన్నారు. సకల జనుల సమ్మె జరిగే సందర్భంలో ఢిల్లీకి వెళ్లిన కెసిఆర్, కెటిఆర్లు ముడుపులు తెచ్చుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పరకాల ఎన్నికలప్పుడు మూడు నెలల్లో తెలంగాణ తేకుంటే రాళ్లతో కొట్టాలంటూ కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆయన ఆ ప్రకటన చేసి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆయన పెదవి విప్పడం లేదన్నారు. విమలక్క జైల్లో ఉంటే టిఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా కెసిఆర్కు సమయం లేకుండా పోయిందన్నారు.