అజ్ఞాతంలోటిడిపి ఎమ్మెల్యే యరపతినేని: పోలీసులవేట?
యరపతినేని జాడ తెలుసుకునేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. యరపతినేని ఢిల్లీకి వెళుతున్నానని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లడం వెనుక ఓ కేసుకు సంబంధించి పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతోనే. గత నెల 27న పిడుగురాళ్లలో కాంగ్రెసు పార్టీకి చెందిన నరేంద్ర హత్య జరిగింది.
ఈ కేసులో యరపతినేని ప్రమేయముందని హత్యకు గురైన నరేంద్ర బంధువులు ఆరోపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో యరపతినేని మూడో నిందితుడు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించిన పోలీసులు ఇప్పటికి 13 మందిని అరెస్టు చేశారు.
ఒక్క యరపతినేని అరెస్టు చేయాల్సి ఉంది. కానీ అతను అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. యరపతినేని అరెస్టుకు బలమైన ఆధారాలు ఉన్నాయని, అరెస్టు తప్పదని పోలీసులు అంటున్నారు. యరపతినేని అంగరక్షకులను, ఉపయోగించే వాహనాన్ని పిడుగురాళ్లలో వదిలి వెళ్లాడు. అతని కోసం హైదరాబాదులో కూడా గాలిస్తున్నారు.