జగన్ పార్టీలో పిఆర్పీ లక్షణాలు: రామజోగయ్య వివరణ
ఆయన జైలుకు వెళ్లిన తర్వాత కూడా మనం జనంలో ఉండాలని పార్టీ నేతలకు సూచించానన్నారు. జగన్ వలే ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పానని, అలా కాకుండా ఇంట్లో కూర్చుంటే ప్రజారాజ్యం పార్టీ గతి పడుతుందని మాత్రమే అన్నానని హరిరామ జోగయ్య చెప్పారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆయనను ఇమేజ్తో ఓట్లు పడతాయని ఎవరూ కష్టపడకుండా అందరూ ఇంట్లో కూర్చున్నారన్నారు.
అందుకే అధికారంలోకి రాలేదన్నారు. జగన్ను, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా చూపించి ఇంట్లో కూర్చోవడం సరికాదని, ప్రజల్లో ఉండాలని హెచ్చరించేందుకే తాను అలా అన్నానని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించేందుకు చెప్పానన్నారు. తాను గతంలో ఉన్న ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని అందుకే అధికారంలోకి రాకపోయి ఉండవచ్చునని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నెగ్గేదేమో అన్నారు.
కాగా వైయస్ జగన్ నాయకత్వంలోని తమ పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత వైఖరి కొనసాగితే ప్రజారాజ్యం పార్టీ గతే తమ పార్టీకి పడుతుందని ఆయన అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జోగయ్య మాట్లాడారు. సహకార ఎన్నికలు ఒక ప్రధాన అజెండాగా నిర్వహించిన సమావేశంలో నాయకులు దానిపై ఎటువంటి ప్రణాళికను ప్రకటించకపోవడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.