ఇక వెనుక చూపులేదు: మోడీ ట్వీట్, కాంగ్రెస్ జోరు
విశ్వధరలో గుజరాత్ పరివర్తన్ పార్టీ(జిపిపి) అధ్యక్షుడు కేశూభాయ్ పటేల్ ముందంజలో ఉన్నారు. జిపిపి బిజెపిని ప్రభావితం చేయనుంది. అయితే మూడు నాలుగు సీట్ల కంటే ఎక్కువగా గెలిచే అవకాశాలు లేవని ఫలితాల సరళిని చూస్తే తెలుస్తోంది. అయితే బిజెపి ఓట్లను భారీగా చీల్చిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే సర్వే ఫలితాలకు భిన్నంగా కాంగ్రెసు పార్టీ కూడా గుజరాత్లో దూసుకు పోతోంది.
బిజెపియే తిరిగి అధికార పీఠం చేజిక్కుంచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీ సర్వేల అంచనాలను మించి సీట్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపి 120 - 145 సీట్ల వరకు గెలుస్తుందని, కాంగ్రెసు 40 వరకు సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. కానీ కాంగ్రెసు దాదాపు గతంలో కంటే ఎక్కువగా అంటే అరవై సీట్లకు పైగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి బూకీలు చెప్పినట్లుగా 100 నుండి 120 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అహ్మదాబాద్లో 21కి గాను 18 స్థానాల్లో, సౌరాష్ట్రలో 34కి గాను 21 స్థానాల్లో, సూరత్లో 16కు గాను 13 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉంది. జామ్ నగర్ రూరల్లో కాంగ్రసు ఆధిక్యంలో ఉంది. ఏడు జిల్లాల్లో కాంగ్రెసు ముందంజలో ఉంది. రాజ్ కోట్ వెస్ట్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. గుజరాత్ పిసిసి చీఫ్ అర్జున్ వెనుకబడ్డారు. జామ్ నగర్లోని ఏడు స్థానాల్లో బిజెపి 6, కాంగ్రెసు ఒక స్థానంలో ముందంజలో ఉంది.
సురేంద్ర నగర్ లోని ఐదు నియోజకవర్గాల్లో బిజెపి ముందంజలో ఉంది. అమ్రేలిలోని ఐదు జిల్లాల్లో మూడింటిలో కాంగ్రెసు, భావనగర్ లోని తొమ్మిదింటిలో ఏడు నియోజకవర్గాల్లో బిజెపి ముందంజలో ఉంది. బిజెపి మ్యాజిక్ ఫిగర్ దాటింది.