పర్మిషన్ అవసరంలేదు: మోపిదేవి,ధర్మానకు నోటీసులు
ఇప్పటికే ఐపిసి సెక్షన్ల కింద అభియోగాలను కోర్టు పరిగణనలోకి తీసుకోగా, తాజాగా అవినీతి నిరోధక చట్టం-1988 కింద తాము నమోదు చేసిన అభియోగాలను విశ్వాసంలోకి తీసుకోవాలని కోర్టును సిబిఐ అధికారులు కోరారు. వారి అభ్యర్థనను స్వీకరించిన నాంపల్లి సిబిఐ కోర్టు వారిద్దరికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను 31కి వాయిదా వేసింది. మంత్రులు, అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.
జగతికి నిధుల పెట్టుబడుల వ్యవహారంలో అప్పటి మంత్రులు ధర్మాన, మోపిదేవి, నలుగురు సీనియర్ ఐఏఎస్లపై సిబిఐ వివిధ సెక్షన్ల కింద నేరాభియోగాలను నమోదు చేసింది. దీంతో ధర్మాన, మోపిదేవిపై పిసి యాక్ట్ కింద నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా మెమో దాఖలు చేసింది. నేరం జరిగినప్పుడు ఉన్న పదవుల్లో వారు ఇప్పుడు లేనందున పిసి యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన వారికి వర్తించదన్నారు.
చౌతాలా కేసులో సుప్రీం తన తీర్పులో ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని సిబిఐ కోర్టుకు వివరించింది. తాము అరెస్టు చేసే నాటికి మంత్రి మోపిదేవి ఎమ్మెల్యేగానే ఉన్నారని ఆ కారణంగా, ఆయన ప్రాసిక్యూషన్కు తాము అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరలేదని సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపారు.