షిరిడీ సాయి ఆలయం పేల్చేందుకు 350 కోట్ల సుపారీ
ముంబయి: మహారాష్ట్రలోని షిరిడీ సాయి బాబా ఆలయాన్ని బాంబులతో పేల్చేస్తామంటూ షిరిడీ ట్రస్టు సభ్యులకు లేఖ అందింది. జనవరి 1వ తేదిన షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని బాంబులు పెట్టి పేల్చి వేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిందని ముగ్గురు వ్యక్తుల సంతకాలతో కూడిన ఓ లేఖ వచ్చింది. ఈ లేఖను షిరిడీ సాయి బాబా సంస్థాన్ ట్రస్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి యశ్వంత్ మనే గురువారం పోలీసులకు అందజేశారు.
షిరిడీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ దత్తా పవార్ కథనం మేరకు.. మనే అందించిన ఉత్తరంలో అంకుష్ భూసే, భాస్కర్ కదం, బాలు లహుద్కర్ అనే వారి సంతకాలు ఉన్నాయని, లేఖపై బుల్దానా జిల్లా తపాలా కార్యాలయం ముద్ర ఉందని తెలిపారు. ఈ పేలుడు కోసం రూ.350 కోట్ల రూపాయల సుఫారీను కూడా అందుకున్నట్లు లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తాము జనవరి 1న పేల్చే వేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
జనవరి 1వ తేదిన పెద్ద ఎత్తున షిరిడీకి భక్తులు వస్తారని, ఉగ్రవాదులు అందులో కలిసిపోయే అవకాశముందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేఖను క్రైమ్ బ్రాంచుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారన్నారు.
భారీ భద్రత
షిరిడీ సాయిబాబా ఆలయం పైన ఉగ్రవాదుల కన్ను పడటంతో పోలీసులు, ట్రస్టు సభ్యులు అప్రమత్తమయ్యారు. జనవరి ఒకటవ తేది కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఉగ్రవాదులు వారిలో కలిసిపోయే అవకాశం ఉంది. ట్రస్టు సభ్యులు సమావేశమై సిబ్బందిని అలర్ట్ చేశారు. షిరిడీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 85 సిసి కెమెరాలను ఉంచారు. ప్రతి భక్తుడిని తనిఖీ చేస్తున్నారు. ఎటిఎస్ హై అలర్ట్ చేసింది.