గ్యాంగ్ రేప్: న్యాయంపై సోనియా హామీ, తగ్గని ఆందోళన
అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో సోనియా వారితో దాదాపు ఇరవై నిమిషాల పాటు మహిళలకు రక్షణ అంశంపై మాట్లాడారు. 10 జనపథ్లోని తన ఇంటి నుండి బయటకు వచ్చిన సోనియా కింద కూర్చొని మాట్లాడారు. తాను మీతో ఉన్నానని, ఎప్పటిలోగా న్యాయం చేయగలమో చెప్పలేమని అయితే న్యాయం మాత్రం తప్పకుండా చేస్తామని, అందుకోసం మేం ప్రయత్నాలు చేస్తున్నామని సోనియా ఆందోళనకారులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆందోళనకారులు సోనియా గాంధీకి డెడ్ లైన్ పెట్టగా.. డైడ్ లైన్ లాంటివేవీ లేవని.. అయితే కఠిన చర్యలు మాత్రం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆదివారం కూడా ఆందోళనకారులు ఢిల్లీ రోడ్ల పైకెక్కారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు మెట్రో రైలు గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఆదివారం పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటరియేట్, ఉద్యోగ్ భవన్, రేసు కోర్సు తదితర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్స్ మూతపడ్డాయి.
అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలు రూపొందించాలని సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే అన్నారు. అత్యాచారాలపట్ల నిరసన తెలుపుతూ న్యాయం కావాలని దేశవ్యాప్తంగా నినదిస్తున్న యువతకు హజారే తన మద్దతు పలికారు. వ్యాపారస్తులు, సంఘ విద్రోహశక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసి ఏమాత్రం భయపడటం లేదనడానికి నిదర్శనం ఢిల్లీ సంఘటన అన్నారు.