చంచల్గూడ జైలు నుండి మోపిదేవి విడుదల
కాగా మోపిదేవి వెంకటరమణకు తాత్కాలిక ఊరట లభించింది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లడానికి ఆయనకు హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు గురువారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకుగాను మోపిదేవికి షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీన నుంచి వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది.
తన యాత్ర వివరాలను సిబిఐకి ముందే తెలియజేయాలని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. అదే విధంగా, యాత్రలో సిబిఐ కానిస్టేబుల్ ఒకరు మోపిదేవి ఉండాలని సూచించింది. కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవద్దని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. దానికితోడు, 25 రూపాయలేసి రెండు పూచీకత్తులు తమకు సమర్పించాలని కూడా కోర్టు ఆయనకు షరతు పెట్టింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇటీవల మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను అయ్యప్ప మాల వేశానని, శబరికి వెళ్లేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
తాను పందొమ్మిదేళ్లుగా అయ్యప్ప మాలను యధావిధిగా వేస్తున్నానని, అలాగే ఈసారి వేశానని, శబరికి వెళతానని అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు తనకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. వైఆబ్కారీ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు మే 24వ తేదీన అరెస్టు చేశారు. వాన్పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు.