బొత్స అర్థరాత్రి మహిళలు వ్యాఖ్యలపై నేతల ఫైర్
అదేసమయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడ్డారు. సీట్లు, నోట్ల కోసం కెసిఆర్ తెలంగాణవాదాన్ని వాడుకుంటున్నారని విమర్సించారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ నిర్ణయం చెప్పబోతుందనే విషయం తెలిసి కెసిఆర్కు వణుకు పుడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణవాదాన్ని ఓట్లుగా మార్చుకుని 2014 ఎన్నిక్లలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కెసిఆర్ ప్రయత్నాలను తాము అడ్డుకుంటామని ఆయన చెప్పారు.
బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఖండించారు. మహిళలు అర్థరాత్రి తిరగకూడదని, బయటకు రాకూడదని బొత్స సత్యనారాయణ ఎందుకు అన్నారో తెలియదని ఆయన సోమవారం అన్నారు. మహిళలు ఎప్పుడైనా రోడ్డు మీదికి రావచ్చునని ఆయన చెప్పారు. ఢిల్లీ ఘటనపై రాజకీయ నేతలు స్పందించాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
బొత్స వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆమె బొత్స సత్యనారాయణకు సూచించారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని ఆమె చెప్పారు.
మహిళలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష అన్నారు. బొత్స సత్యనారాయణ భార్య ఎంపిగా ఉన్నారని, ఆర్థరాత్రి పార్టీ కార్యక్రమాల కోసం ఆమె తిరగడం లేదా అని ఉష అన్నారు. బొత్స తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.