నటికి లైంగిక వేధింపు: కాల్పుల్లో చానల్ జర్నలిస్ట్ మృతి
ఇంఫాల్: మణిపూర్లో ప్రముఖ నటిని లైంగికంగా వేధించిన అంశం ఆ రాష్ట్రాన్ని అట్టుడికించింది. నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. నిధుల సేకరణ కోసం రాష్ట్రంలోని చందేల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఓ వేదికపైకి నాగా తీవ్రవాది వచ్చి అక్కడ ఉన్న నటి మొమోకోతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనను తాకాడని.. అభ్యంతరం చెప్పగా, జుట్టు పట్టుకుని కిందకు తోసేసి పిడిగుద్దులు కురిపించాడని మొమోకో ఆరోపించారు.
దీంతో మణిపురి చిత్ర పరిశ్రమ మండిపడింది. తీవ్రవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధిక బంద్కు శనివారం పిలుపునిచ్చింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసిన నాగా తీవ్రవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేపట్టిన బంద్ ఉగ్రరూపం దాల్చి హింసాత్మకంగా మారింది. బంద్కు మద్దతుగా ఇంఫాల్ వీధుల్లోకొచ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రైమ్టైమ్ టీవీ చానల్ రిపోర్టర్ తాంగ్జెమ్ నానోసింగ్కు బుల్లెట్ గాయాలయ్యాయి.
చికిత్స పొందుతూ తర్వాత ఆయన ఆస్పత్రిలో మరణించారు. దీంతో నగరంలో మళ్లీ పదహారు గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. నిరసనకారులు శాంతించాల్సిందిగా డిప్యూటీ గై కంగమ్ కోరారు. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నాగా తీవ్రవాదిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశంపైనే మాట్లాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారని తెలిపారు.
అయితే, నిందితుడిని అరెస్ట్ చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మణిపురి చిత్ర పరిశ్రమ స్పష్టం చేసింది. నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కాగా అంతకుముందు నటిని లైంగికంగా వేధించిన అంశం మణిపుర్ అసెంబ్లీని అట్టుడికించింది. ప్రతిపక్ష సభ్యుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. నటిని వేధించిన వారిపై కఠిన చర్యలుతీసుకుంటామని మణిపూర్ ఉప ముఖ్యమంత్రి గై కంగమ్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు.