అనివార్య పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి: ఎర్రన్న కొడుకు
తన తండ్రి ఎర్రన్నాయుడు ఆత్మీయులను కలిసేందుకే తాను పార్టీ కార్యాలయానికి వచ్చానని చెప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తాను అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. తన తండ్రి బాటలో తాను నడుస్తానని కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
కాగా ఇరవై రోజుల క్రితం శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా రామ్మోహన్ నాయుడిని పార్టీ నియమించిన విషయం తెలిసిందే. ఎర్రన్నాయుడు మృతి చెందడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎవరిని పోటీకి దింపాలనే అంశంపై మొదట తర్జన భర్జన పడ్డ టిడిపి ఆ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చి రామ్మోహన్ నాయుడిని ఇంచార్జిగా నియమించింది.
అంతకుముందు రామ్మోహన్ నాయుడు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నిజామాబాద్ జిల్లా వస్తున్నా మీకోసం పాదయాత్ర సమయంలో కలిశాడు. రామ్మోహన్ నాయుడుతో తన చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా వెంట వచ్చారు. వీరి భేటీలో రామ్మోహన్ నాయుడు రాజకీయ భవిష్యత్తు చర్చకు వచ్చింది. అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడికి అండగా ఉండనున్నారు. ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు పేరునే అందరూ సూచించారు.
శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు ఉన్నన్నాళ్లూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు, సోదరుడు... ఇలా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కూడా ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడును ఎంపిక చేసింది.
ఆ సందర్భంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు తనపై నమ్మకాన్ని ఉంచి ఈ బాధ్యతలు అప్పగించారని దానిని నిలబెట్టుకుంటానని చెప్పారు. తన తండ్రి పార్టీ కోసం ఎలా చిత్తశుద్ధితో పనిచేశారో తాను అలాగే పని చేస్తానన్నారు. పార్టీ కోసం అహర్నిషలు పాటుపడుతానన్నారు.