సిఎం కుట్ర అంటూ ఎపిపిఎస్సీకి రిపుంజయ రాజీనామా
అవినీతి నిరోధక శాఖ నిన్న అరెస్టు చేసిన రిపుంజయ రెడ్డిని ఈ రోజు న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండు విధించింది. జనవరి 9 వరకు రిపుంజయ రెడ్డికి రిమాండును వి్ధించారు. దీంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు.
కాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఎపిపిఎస్సీ సభ్యుడు రిపుంజయ్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఆయన ఇంట్లో, ఇద్దరు సోదరుల ఇళ్లలో, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. 4 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమాస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు.
వాటిలో రూ.3.5 కోట్ల విలువైన వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, 63 తులాల బంగారం, 3.5 కోట్ల వెండి, రూ. 30 లక్షల విలువైన బ్యాంకు నిల్వల పత్రాలు ఉన్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సూరీడు నివాసంలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. రిపుంజయ్ రెడ్డి, సూరీడు కలిసి వ్యాపారాలు చేశారనే సమాచారంతో ఈ సోదాలు జరిగాయి.
రిపుంజయ్ రెడ్డి ఆస్తులన్నీ 2008 తర్వాతనే సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. సూరీడు, రిపుంజయ రెడ్డి కలిసి వ్యాపారాలు చేశారని ఎసిబి డిఎస్పీ చంద్రశేఖర్ బుధవారం అన్నారు. సూరీడు, రిపుంజయ రెడ్డి ఇళ్లలో ఎసిబి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు కలిసి వ్యాపారాలు చేశారని, వారి వ్యాపార లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఎనిమిది బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నామని, రిపుంజయ రెడ్డికి సంబంధించి ఐదు చోట్ల సోదాలు జరిగాయి. ఐదుచోట్ల బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందన్నారు. తార్నాక, హకీంపేట, కొండాపూర్, రాజేంద్రనగర్, కడపలలో ఇళ్లు ఉన్నట్లుగా తేలిందన్నారు. కడపలో 36 ఏకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కనుగొన్నట్లు చెప్పారు. అరకిలో బంగారం, లాకర్లో రూ.30 లక్షల నగదును గుర్తించినట్లు చెప్పారు. కొండాపూర్లో 600 గజాల స్థలం ఉన్నట్లు తేలిందని, 2008 నుంచి రిపుంజయ రెడ్డి ఆస్తులు సంపాదిస్తున్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు.
అయ్యప్ప సొసైటీలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరూర్ వైశ్య బ్యాంకులో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా సమాచారం. వెంకటగిరిలో ఒకే అపార్టులమెంటులో ఆరు ప్లాట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. రిపుంజయ రెడ్డి, సూరీడు ఇళ్లలో నుండి కీలక పత్రాలు ఎసిబి స్వాధీనం చేసుకున్నారు.