ట్వీట్స్: బాలకృష్ణను అడుగు.. లోకేష్కు కెటిఆర్ కౌంటర్
చంద్రబాబు నిత్యం రంగులు మార్చే వ్యక్తి అని ఆయన గురించి తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అన్నారు. 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని గెలిచిన సీట్లలో తెలుగుదేశం పార్టీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇచ్చిన టిడిపి లేఖలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదన్నారు. అలాగే తెలంగాణను సమర్థిస్తామని కూడా లేదన్నారు. చంద్రబాబు నాయుడుకు తక్కువ విశ్వసనీయత ఉంటుందన్నారు. బాబు గురించి బాలకృష్ణ, హరికృష్ణను అడిగితే చెబుతారన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుసుకోవాలన్నారు.
అనుభవం లేని మాటలు
నారా లోకేష్ మాటలు అనుభవం లేనివిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కొట్టి పారేశారు. లోకేష్కు తమ పైన, తమ పార్టీ పైన మాట్లాడే అర్హత ఏమాత్రం లేదన్నారు. లోకేష్కు ఇంగ్లీష్ వస్తే తెలంగాణ పదం లేఖలో ఎక్కడ ఉందో చూపించాలన్నారు. భాష అర్థం కాకపోతే అనువాదం చేయించుకోవాలని సూచించారు. తెలంగాణపై టిడిపిలో స్పష్టత లేదన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ఇచ్చిన లేఖలో ఏమాత్రం స్పష్టత లేదన్నారు. లోకేష్కు మాట్లాడే అర్హత ఏమాత్రం లేదన్నారు.
శ్రవణ్ నిప్పులు
తమ పార్టీ ప్రజాప్రతినిధులపై నారా లోకేష్ వ్యాఖ్యలు సరికావని తెరాస నేత శ్రవణ్ కుమార్ అన్నారు. కాలం చెల్లిన లేఖతో మోసం చేశారన్నారు. అవాకులు చవాకులు పేలడం చిల్లర మాటలే అన్నారు. అఖిల పక్ష సమావేశం సీమాంధ్ర కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.
జూపల్లి
బాబు చేత లోకేష్ జై తెలంగాణ అనిపిస్తే తాను మీడియా ఎదుట టిడిపి ఆఫీసులో ఊడ్చుతానని జూపల్లి కృష్ణా రావు అన్నారు. నెల రోజుల్లో తెలంగాణ రాకుంటే తెలంగాణ ప్రాంత ఎంపీలు కార్యాచరణ ప్రకటించాలన్నారు.
అడ్డుకుంది బాబే
వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేనని హరీశ్వర్ రెడ్డి అన్నారు. బాబుకు దమ్ముంటే వరంగల్లో జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు.
క్షమాపన చెప్పాలి
హరీష్, కెటిఆర్ల పైన అవమాన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని తెలంగాణ అడ్వోకేట్స్ జెఏసి హెచ్చరించింది. లేదంటే ఆయనను కోర్టుకు ఈడ్చుతామని ప్రకటించింది. లోకేష్ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. బాబుకు మాట తప్పడం అలవాటే అన్నారు.