అప్పుడు అలా: సూరీడు ఇప్పుడు మర్యాద రామన్న
తన నివాసంలో బుధవారం ఎసిబి దాడులు జరిగినప్పుడు ఆయన అత్యంత మర్యాదగా, నమ్రతగా వ్యవహరించాడని అంటున్నారు. ఎసిబి అధికారుల ముందు కూర్చోవడానికి కూడా ఆయన వెనకాడారని అంటున్నారు. అధికారం కోల్పోయిన సూరీడు అతి సామాన్య వ్యక్తిగా వ్యవహరించారు. బుధవారం ఉదయం 6 గంటలకు ఎసిబి అధికారులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో గల గాయత్రినగర్లో సూరీడు ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
ఎసిబి అధికారులు వచ్చినప్పుడు ఇంట్లో సూరీడు లేరు. ఆయన భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సూరీడు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి పులివెందుల వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఎసిబి అధికారులకు చెప్పారు. సోదాల గురించి తెలుసుకున్న సూరీడు పులివెందుల నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో హైదరాబాదులోని ఇంటికి చేరుకున్నారు. సోదాలు నిర్వహిస్తున్నంత సేపు ఎసిబి అధికారుల ముందు కూర్చోవడానికి సూరీడు వెనకాడారు. నించొనే ఉన్నారు.
సూరీడు చెలాయించిన అధికారం గురించి తమకు కూడా తెలుసునని, ఇప్పుడు సూరీడి ప్రవర్తన తమకు ఆశ్చర్యం కలిగించిందని ఎసిబి అధికారులు అన్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. వైయస్ మరణం తర్వాత జరిగిన తన కూతురు పెళ్లికి వైయస్ విజయమ్మ గానీ వైయస్ జగన్ గానీ హాజరు కాలేదని సూరీడు ఎసిబి అధికారులకు చెప్పినట్లు సమాచారం.
సూరీడు ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు వెళ్లి అర్థరాత్రి దాటిన తర్వాత వచ్చేవారని, 30 ఏళ్ల పాటు వైయస్ కుటుంబానికి సూరీడు కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సేవలు చేశారని, ఇప్పుడు వైయస్ కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ పత్రిక రాసింది. ఇప్పుడు సూరీడు వద్ద ఆయుధాలేమీ లేవు. సెక్యూరిటీ గార్డు కూడా లేడు. కారియర్ పర్మిట్తో ఇంతకు ముందు వైయస్కు చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ ఉండేదని, వైయస్ మరణం తర్వాత దాన్ని పోలీసుల ద్వారా వైయస్ కుటుంబ సభ్యులకు అప్పగించానని సూరీడు చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.
ఎసిబి అధికారులు అరెస్టు చేసిన రిపుంజయ రెడ్డితో కలిసి తిరుపతి, రేణిగుంట మధ్య కొన్న భూమి ఉందని, అంతకు మించి రిపుంజయ రెడ్డితో సూరీడికి సంబంధాలు ఉన్నట్లు కనిపించడం లేదని అంటున్నారు. సూరీడికి జాబ్లీహిల్స్లోని ఇంటితో పాటు శ్రీనగర్ కాలనీలో మరో ఇల్లు ఉంది.