తెలంగాణ: సాయంత్రానికి షిండే మాట మారింది
నెల రోజుల్లోగా పరిష్కరించాలని కొన్ని పార్టీలు కోరాయని మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉంది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అంశం అందులో లేదు. నెల రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని షిండే తమకు అఖిల పక్ష సమావేశంలో చెప్పినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మీడియాతో చెప్పారు. అదే విషయాన్ని ఆ తర్వాత షిండే తన మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్రువీకరించారు. దీంతో నెల రోజులు ఆగలేరా అంటూ కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు ఇతర పార్టీలను అడిగాయి కూడా. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటనపై రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తెలంగాణ అంశంపై ప్రభుత్వం నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఉదయం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 8 పార్టీల అఖిల పక్ష సమావేశం అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధుల చొప్పున అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని ఆయన చెప్పారు.
అఖిల పక్ష సమావేశం ఇన్కెమెరా మీటింగ్ అని, అందువల్ల ఏ పార్టీ ప్రతినిధులు ఏమన్నారనే విషయం తాను వెల్లడించబోనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇదే చివరి అఖిల పక్ష సమావేశమని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని పార్టీల ప్రతినిధులు కోరాయని ఆయన అన్నారు. సమావేశంలో ఎవరేమి చెప్పారనేది వెల్లడించడానికి ఇది వేదిక కాదని ఆయన అన్నారు.
సమావేశం జరిగిన తీరు పట్ల తనకు సంతృప్తిగా ఉందని ఆయన చెప్పారు. తమ పట్ల కొందరు సంతృప్తి చెందుతారు, కొందరు చెందరని, అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారని ఆయన వివరించారు. సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్రంలోని యువత సంయమనం పాటించాలని ఆయన అన్నారు. తాము అందరి వాదనలు విన్నామని, వాటిని నమోదు చేశామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని అంటూ వాటికి తన ధన్యవాదాలు తెలిపారు. నెల రోజుల్లో తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని చెప్పాను కదా అని ఆయన సమాధానమిచ్చారు. చాలా వేడిగా జరుగుతుందని భావించిన అఖిల పక్ష భేటీ ప్రశాంత వాతావరణంలోనే జరిగింది. తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో చెప్పిన వైఖరికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం అఖిల పక్ష భేటీలో చెప్పింది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తావమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.