తెలంగాణ బంద్: ఎక్కడి బస్సులు అక్కడే, అరెస్టులు
హైదరాబాదులోని కూకట్పల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ దిష్టిబొమ్మను తెలంగాణవాదులు దగ్ధం చేశారు. వైయస్సార్ కాగ్రెసు కార్యాలయ ముట్టడికి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బయలుదేరారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరీంనగర్ ఆర్టీసి బస్సు స్టాండ్ ముందు తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణవాదులు ఎఎంసి మైదానంలోని ఇందిరా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం ముందు ఉన్న కాంగ్రెసు జెండా గద్దెను కూల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బస్ డిపోల ముందు తెరాస కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆరు డిపోల పరిధిలో 400 బస్సులు నిలిచిపోయాయి.
మహబూబ్నగర్ జిల్లాలో అధికారులు జిల్లా వ్యాప్తంగా 841 బస్సులను రద్దు చేశారు. షాద్నగర్ బస్టాండ్ ఎదుట తెరాస, తెలంగాణ జెఎసి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బంద్ సందర్భంగా హైదరాబాదులో భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల జాతీయ రహదారిపై ఆందోళనకారులు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లా బంద్ సందర్భంగా నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది.