నిర్లక్ష్యం: తెలుగు మహాసభలపై రోశయ్య అసంతృప్తి
మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన లేఖ మేరకు 29న తిరుపతి వెళ్లాలని రోశయ్య ముందుగా నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా పంపారు. కానీ, శుక్రవారం రాత్రి వరకూ ఆయన్ను మళ్లీ ఎవరూ సంప్రదించకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని నిర్ణయించుకున్నట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా నిర్వాహకులు ఆదిలో ఆహ్వానపత్రం అందించారు. తరువాత సమాచారం లేకపోవడంతో మహాసభలకు వెళ్లరాదని ఆమె నిర్ణయించుకున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.
సభల నిర్వహణ తీరు కూడా అంతే గందరగోళంగా ఉంది. అంతా అయోయంగా ఉందని అక్కడికి వెళ్లినవారు అంటున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా సమాచారం అందించలేని స్థితి నెలకొని ఉంది. సినీ ప్రముఖులకు సన్మానం చేసి, వారిని వేదికపై కూర్చోబెట్టిన నిర్వాహకులు రచయితలకు సన్మానం చేసి వారిని వేదికపై నుంచి దించేశారు. తెలుగు భాషాసంస్కృతుల పరిరక్షణ గురించి మాట్లాడేవారు రచయితలకు ఇలాంటి అవమానం చేయడం ఏమిటని అంటున్నారు.