జగన్కు ఝలక్: కోమటిరెడ్డి యు టర్న్, తెరాస వైపు!
హైదరాబాద్: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి యూ టర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్(కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) ఎప్పటికైనా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వారు రాజీనామా చేసినా, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా జగన్ వైపు వెళ్లేందుకేననే వాదనలు వినిపిస్తుంటాయి.
వారికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి తర్వాత కూడా జగన్కు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు. దీంతో వారు జగన్ పార్టీలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధమయ్యారనే ప్రచారం జిల్లాలో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాన్ని వారు ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తున్నారు. కానీ ఆ ప్రచారానికి మాత్రం తెరపడట్లేదు. ఏం చెప్పినా జగన్ పార్టీ వైపే వారు మొగ్గు చూపుతారని చెబుతున్నారు.
అఖిల పక్షం తర్వాత...
జగన్ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన వారికి ఇటీవలి వరకు బాగా ఉండేదని అంటున్నారు. అయితే అఖిల పక్ష సమావేశం తర్వాత కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకొని ఉంటారని అంటున్నారు. ఆదివారం ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి. తాను జగన్ పార్టీలోకి వెళ్లనని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తానని జరిగే ప్రచారం అంతా ఉత్తిదే అన్నారు.
తాను కొండా లక్ష్మణ్ బాపూజీ దారిలో స్వతంత్ర తరహాలో ఉద్యమిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఉద్యమిస్తానన్నారు. తెలంగాణ కోసం పార్టీ మారాల్సిన పరిస్థితే వస్తే తాను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తానే కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. అఖిల పక్ష సమావేశంలో జగన్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. టిడిపికి ప్లస్ అయింది.
కేవలం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇరుకునపడ్డాయి. దీంతో తెలంగాణవాదులు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరుగుతున్నారు. దీంతో కోమటిరెడ్డి వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పిన తాను తెలంగాణవాదులకు టార్గెట్గా మారిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే హర్షించరనే కారణంతో ఆయన యు - టర్న్ తీసుకొని ఉంటారని చెబుతున్నారు.
చిరంజీవిని తీసుకు వస్తారా
కాంగ్రెసు పార్టీ 2014 వరకు తెలంగాణను కాలాయాపన చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని కోమటిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. తాను రాజీనామా చేస్తే.. తన భిక్షతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారని మండిపడ్డారు. తన భిక్షతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడిన కేంద్రమంత్రి చిరంజీవిని జిల్లాకు ఆహ్వానించడమేమిటని ప్రశ్నించారు. మంత్రులంతా పనికి రాని వారని, వారు పదవులకు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు. తాను ఏ పార్టీలో చేరనని, అవసరమైతే మాత్రం తెరాసలో చేరుతానన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తరహాలో స్వతంత్ర ఉద్యమానికే ప్రధాన్యత అన్నారు.