జగన్పై మాట్లాడరేం?: టి కాంగ్Xసీమాంధ్ర కాంగ్, బాబుపై
కెకె వ్యాఖ్యలు బాధాకరం
తమ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు వ్యాఖ్యలు బాధాకరమని శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణను ఎవరూ ఆపలేరని చెప్పిన కెకె ఇరవై నాలుగు గంటల్లో తమ అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం ప్రకటించే వరకు కె కేశవ రావు సంయమనం పాటించాల్సి ఉండెనన్నారు.
జగన్ గురించి మాట్లాడరేం
తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న గాదె వెంకట రెడ్డి, టిజి వెంకటేష్, లగడపాటి రాజగోపాల్లు ఎప్పుడైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారా అని సీనియర్ కాంగ్రెసు నేత ఆమోస్ ప్రశ్నించారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా ఆ నేతలు ప్రవర్తించవద్దని సూచించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని చెప్పేందుకు సీమాంధ్ర నేతలు ఎవరని అన్నారు.
తెలంగాణ రాదని ఇంత ఖచ్చితంగా చెబుతున్న నేతలు జగన్ గురించి ఎప్పుడైనా మాట్లాడారా అన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణపై ఓ నెల రోజులు ఓపిక పట్టరా అని అడిగారు. సీమాంధ్ర నేతలు మర్యాద పోగొట్టుకోవద్దని, వారి స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
ఊహాగానాలు సరికాదు
తెలంగాణపై చర్చలు కొనసాగుతున్నప్పుడు ఊహాగానాలు సరికాదని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణపై నెల రోజుల్లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సలహా ఇస్తారన్నారు. మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి విభజనపై తన అభిప్రాయం మాత్రమే చెప్పారన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు పదవులు రాకపోవడానికి తాను కారణం కాదన్నారు.
గాదెది పార్టీ అభిప్రాయం కాదు
విభజనపై అఖిల పక్ష సమావేశంలో గాదె వెంకట రెడ్డి వ్యక్తపర్చిన అభిప్రాయం ఆయనదేనని పార్టీది కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ముక్కలు చేస్తే సహించం
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదని కాంగ్రెసు కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి కడపలో అన్నారు. రాష్ట్రాన్ని విడదీసి ముఖ్యమంత్రి కావాలని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కలలు కుంటున్నారని ధ్వజమెత్తారు. గత ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని సీమాంధ్ర ప్రజలు గెలిపించారని కానీ ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
అదే తెలంగాణలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ప్రాంతాలుగా విడదీసి ముఖ్యమంత్రి కావాలనుకోవడం దారుణమన్నారు. దీనిని ప్రజలు సహించరన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసులకు సీమాంధ్రలో మనుగడ కష్టమే అన్నారు.
బాబు మోసం చేశారు
చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రం విడిపోయే సమస్యే లేదన్నారు. రాష్ట్రం ఎప్పటికీ సమైక్యంగానే ఉంటుందని, సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. బాబుకు సీమాంధ్ర ప్రజలు బుద్ది చెప్పే రోజు వస్తుందన్నారు.