నెలలో తెలంగాణ: ఒత్తిడిలో తెలంగాణ కాంగ్రెస్, 4న భేటీ
కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఇటీవల తరచు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ఆలోచనలో పడేస్తున్నాయి. అధిష్ఠానం మనసెరిగే వారు అలా మాట్లాడుతున్నారేమో అనే సందేహాలు నెలకొంటున్నాయి. రాష్ట్ర విభజనకు ఏ మాత్రం అంగీకరించేది లేదని జగ్గారెడ్డి చెప్పడం వెనుక హైకమాండ్ సంకేతాలు ఏమైనా ఉండవచ్చునని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను అధిష్ఠానం ముందు గట్టిగా ఉంచేందుకు వీలుగా ఈ నెల 4న మంత్రుల క్వార్టర్స్లో సమావేశం కావాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. ఈ సమావేశానికి మంత్రులను రప్పించే బాధ్యతను మంత్రులు జానా రెడ్డి, శ్రీధర్బాబు తమ భుజానకెత్తుకున్నారు. గతంలో జరిగిన కొన్ని సమావేశాలకు మంత్రులు హాజరు కాకపోవడంతో.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతల మధ్య పొరపొచ్చాలున్నాయన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లోకి వెళ్లింది.
ఈసారి అలా జరగకుండా చూడాలని భావిస్తున్నారు. గతంలో తెలంగాణపై డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహ ఒక సమావేశాన్ని నిర్వహించారు. విదేశీ పర్యటన తర్వాత మళ్లీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నేతలలను సమీకరిస్తానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగో తేదీన జరిగే సమావేశానికి ఆయన హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.