బాబు యాత్ర: మెరిసిన బాలయ్యకూతురు, వెంట లోకేష్
బాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణిలు వరంగల్ జిల్లాలోని కామారం గ్రామంలో ఆయనను కలుసుకున్నారు. ఆయనను పరామర్శించారు. బ్రాహ్మిణి మొదటిసారి పాదయాత్ర సందర్భంగా కనిపించడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. బాబు కోడలు మాత్రమే కాకుండా బాలకృష్ణ కూతురు కావడంతో అందరూ ఆసక్తి కనబర్చారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు చిటికెన వేలు నొప్పితో బాధపడుతున్నారు. ఆయనకు వైద్యులు రోజుకు మూడుసార్లు పరీక్షలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. వైద్యులు రెస్టు తీసుకోమన్నప్పటికీ బాబు ససేమీరా అంటున్నారని సమాచారం.
బాబు పాదయాత్ర ప్రారంభం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ఈ రోజు వరంగల్ జిల్లా కామారం నుండి బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెంచికలపేట, దుగ్గొండి, మండలం కేశవపురం, లక్ష్మీపురం, పోనకల్, నాచినపల్లి, గిర్నిబావి మీదుగా ఆయన పాదయాత్ర సాగుతుంది.
తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తన టూర్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నారు. అఖిల పక్ష సమావేశంలో టిడిపి తెలంగాణకు అనుకూలమని చెప్పిన తర్వాత కెసిఆర్ పైన బాబు దూకుడు పెంచారు. కాంగ్రెసు పాలన, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పైన కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.