లగడపాటి పార్టీ సైనికుడు, త్వరలో శుభవార్త: సర్వే
తెలంగాణ ఇస్తారా, చస్తారా అని పదే పదే అంటే ఇవ్వబోమనే అంటారని ఆయన అన్నారు. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తెలంగాణ విషయంలో త్వరలో శుభవార్త వింటారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. అందరి సహకారంతో తెలంగాణ ఇచ్చే దాకా వేచి ఉండాలని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానం ప్రతిని అధిష్టానం పెద్దలకు అందించడానికి ఢిల్లీ వచ్చిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కట్టారు. ఆయన శనివారం ఉదయం తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చెందిన గులాం నబీ అజాద్తో పాటు పలువురిని కలుసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆయన కలుసుకోవాలని భావించారు. అయితే, వారి అపాయింట్మెంట్ ఆయనకు లభించలేదు.
కాగా, ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో జరిగిన సమైక్యాంధ్ర సదస్సుకు కాంగ్రెసు అసంతృప్త పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి హాజరయ్యారు. గత రెండు రోజులుగా కాంగ్రెసు అధిష్టానం కోర్ కమిటీ సమావేశమై తెలంగాణపై చర్చించింది. ఈ నెలాఖరులోగా తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించే ఉద్దేశంతోనే కాంగ్రెసు ఉన్నట్లు తెలుస్తోంది.