కెబిసిలో రూ.5కోట్లు గెల్చుకున్న 37 ఏళ్ల హౌస్ వైఫ్
ఉత్కంఠ భరిత క్షణాలు కొన్ని గడిచిన తర్వాత ఆప్కీ జవాబ్ సహీ హై అంటూ స్వయంగా లేచి వచ్చిన అమితాబ్ 'కౌర్ ' బన్గయీ కరోడ్పతిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి ఆరో సీజన్లో పంజాబీ మహిళ సన్మీత్ కౌర్ సాహెనీ అక్షరాలా ఐదు కోట్ల రూపాయల మెగా బహుమతిని గెలుచుకున్నారు. ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
ముందుగా అమితాబ్, తరువాత తన భర్త వచ్చి చెప్పడంతో తనకే జాక్పాట్ వచ్చిందని నమ్మానని సాహినీ తెలిపారు. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది. తనకు బహుమతిగా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని పంజాబీ సంప్రదాయ కార్యక్రమాలకు దానం చేస్తానని, మిగిలిన మొత్తం ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామని సాహెనీ తెలిపారు.
పంజాబ్లోని చండీగఢ్లో పుట్టి.. కొన్నేళ్లుగా ముంబయిలో ఇళ్ల వద్ద ప్రైవేట్లు చెబుతున్న సాహినీ హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించే వ్యక్తిని వివాహమాడింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కెబిసిలో తొలుత కోటి రూపాయలు మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. తర్వాత దాన్ని రెట్టింపు చేసినా, నాలుగో సీజన్ నుంచి మామూలు బహుమతిని కోటి రూపాయలుగానే ఉంచి.. ఐదు కోట్ల రూపాయల జాక్పాట్ అదనంగా చేర్చారు.