తెలంగాణపై షిండే చెప్పినట్లే: చాకో, సున్నితం: బొత్స
తెలంగాణ అంశంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆచితూచి మాట్లాడారు. ఇది సున్నితమైన అంశమన్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే పాటిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతున్న నిరసనల వేడి బొత్స సత్యనారాయణకు తగిలింది. ప్రతిపక్షాల నుంచే కాకుండా సొంత పార్టీ నేత నుంచి కూడా ఆయనకు ఆ అనుభవం ఎదురైంది. సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ - విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దీని ప్రభావం పార్టీపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్జీల పెంపుపై పునరాలోచించాలని కోరారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తానని అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకునేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
విద్యుత్ సర్చార్జీల భారం సామాన్యులపై పడకుండా కేబినేట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు పాదయాత్ర చేపట్టారని, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు.