హైకమాండ్పై ఆగని పోరు, తగలబెడితే ఇస్తారా: కావూరి
కేంద్రంలో సమర్థవంతమైన నాయకులు కరువయ్యారని, గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోలేకపోవడమే కాదని ఆయన అన్నారు. అవగాహన లేని కొందరు నాయకులు ఇచ్చిన తప్పుడు సలహాలతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని, ఇది ప్రజల దురదృష్టమని కావూరు సాంబశివరావు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఐఏడీపీ హాలులో సోమవారం సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వేర్పాటువాదంపై సమరభేరి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సెంటిమెంట్ పేరుతో, అభివృద్ధి పేరిట ర్రాష్టాలను విడదీస్తూ పోతే దేశం విచ్ఛిన్నం ఖాయమని ఆయన అన్నారు. ఎవరో కొంతమంది రోడ్లపైకి వచ్చి నాలుగు బస్సులు తగలపెట్టినంత మాత్రాన ర్రాష్టాన్ని ఎలా విడదీస్తారని ఆయన అడిగారు.
ఉద్యమం చేసే వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేదని, అధికారం కోల్పోయిన తర్వాత కొందరు ఉద్యోగులు, విద్యార్థులను ప్రలోభ పెట్టి ఉద్యమాలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. అభివృద్ధి చెందలేదని రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, హైదరాబాద్ అని ఇలా ర్రాష్టాన్ని విడదీసుకుంటూ పోతే సమస్యలు అధికమవుతాయే తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు.
రాష్ట్ర విభజనను కావూరి సాంబశివరావు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో నిర్వహిస్తున్న సమావేశాలకు తప్పకుండా హాజరవుతున్నారు.