అసదుద్దీన్ నివాసంపై దాడి: అక్బర్ శరీరంలో తూటా
ఇదిలావుంటే, మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీకి సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. గాంధీ ఆస్పత్రిలో దాదాపు మూడు గంటల పాటు ఐదుగురు వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఐఆర్ చెడిపోవడం వల్ల పరీక్షల్లో జాప్యం జరుగుతుందనే వార్తలను ఆస్పత్రి సూపరింటిండెంట్ ఖండించారు. అక్బరుద్దీన్ శరీరంలో తూటాలున్నాయని, అందువల్ల ఎంఐఆర్ స్కానింగ్ చేయడం కుదరదని ఆయన వివరించారు. గతంలో జరిగిన దాడిలో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకుని వెళ్లాయి.
తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని అక్బరుద్దీన్ సోమవారం సాయంత్రం తన తరఫు న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను సమర్పించారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.
వైద్యపరీక్షలు నిర్వహించి తర్వాత ఆయనను బంజారాహిల్స్ నివాసానికి తీసుకుని వెళ్లి వదిలేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ అరెస్టు విషయంలో పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
అనారోగ్య కారణాలు చెప్పి అరెస్టును తప్పించుకోవాలని చూస్తున్న మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసు వాహనంలో అక్బరుద్దీన్ గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆక్బరుద్దీన్ను గాంధీ ఆస్పత్రికి తరలించే సమయంలో దారి పొడుగునా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజుల వ్యవధి కావాలని అక్బరుద్దీన్ గతంలో పోలీసులను కోరారు. అయితే, అక్బరుద్దీన్ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు