'నాయక్' వివాదం: పేరు మార్పుకు ఎక్స్ ఎమ్మెల్యే ధర్నా
గండి బాబ్జీ బుధవారం జిల్లాలోని పెందుర్తిలో ఆందోళనకు దిగారు. తక్షణమే పేరు మార్చాలని అతను నిర్మాతను, దర్శకుడిని కోరారు. రేపటిలోగా సినిమాలో విలన్ పాత్రధారి పేరు మార్చాలన్నాడు. లేదంటే దర్శకుడి పైన తాను క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నాడు. కాగా ఇందుకు సంబంధించి గండి బాబ్జీ దర్శకుడు వివి వినాయక్తో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. వినాయక్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా రామ్ చరణ్ తేజ హీరోగా, కాజల్, అమలపాల్ హీరోయిన్లుగా నటించిన నాయక్ చిత్రం ఈ రోజు విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ పాత్రధారి రాహుల్ దేవ్ పేరును గండిపేట బాబ్జిగా చూపించారు. అతనో డాన్. సినిమాలోని గండిపేట బాబ్జీ పేరు, ఆందోళన చేపట్టిన గండి బాబ్జీ పేర్లు దగ్గరగా ఉన్నాయి.
ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఫరవాలేదనే టాక్ తెచ్చుకుంది. ఎంతో ఎనర్జీతో పాటలు, ఫైట్స్ చేసుకుంటూ పోయినా కథ, కథనంలో ఎక్కడా మచ్చుకు కూడా ప్రెష్ నెస్ లేకపోవడంతో అతని శ్రమకు తగ్గ సినిమాగా కనపడటం లేదంటున్నారు. ఈ సినిమాలో తన తండ్రి చిరంజీవి 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్నా' అనే గీతాన్ని మాత్రమే రీమిక్స్ చేశారు. అంతేకాకుండా పలు సీన్స్ కూడా అంతకు ముందు వచ్చిన చిత్రాల మిక్స్ లా అనిపిస్తున్నాయని అంటున్నారు.