మూల్యం చెల్లించకతప్పదు: అక్బర్పై చిరు, సిఎంకు షాక్
పెంపు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కూడా పునఃపరిశీలించాలని చిరంజీవి సూచించారు. ఎన్నికలు మరెంతో దూరం లేవన్నారు. అదే సమయంలో సామాన్యులపై భారం పడేలా పెంచకూడదన్నారు. మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాట్లాడుతూ... చట్టం తన పని తాను చేసుకు పోతుందని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. రైల్వే ఛార్జీల పెంపును చిరంజీవి సమర్థించారు.
కాగా నాలుగు రోజుల క్రితం రామచంద్రయ్య పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే.
విద్యుత్ ఛార్జీల పెంపుపై దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య పెదవి విరిచారు. ఇలా ప్రజలపై భారం వేస్తుంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ గెలుపొందటం సులభం అవుతుందా ఆని ఆయన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆదివారం లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయటానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో అధిష్ఠానం ఒక పక్క ప్రయత్నిస్తుంటే, పేదలు, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని చిరంజీవి, ఇతర నాయకులు తాపత్రయపడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అదంతా బూడిదలో పోసిన పన్నీరులా.. పేదల వ్యతిరేక చర్యలు తీసుకోవడాన్ని తానే కాదని, రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తా జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు 2014లో కాంగ్రెస్ను గెలిపించేందుకా లేక ప్రతిపక్ష పార్టీల కోసమా అన్న అంశంపై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ఇంత భారీగా విద్యుత్ చార్జీల భారం వినియోగదారులపై పడిన దాఖలాలు చరిత్రలో ఎన్నడూ లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. సిఆర్సీ తన లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, పేదల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
ప్రభుత్వం తీరు సమర్థించుకోలేని విధంగా ఉందని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమౌతుందోననే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన పార్టీ సమన్వయ కమిటీ భేటీల్లోగానీ, పిసిసి విస్తృత స్థాయి సమావేశాల్లో గానీ చర్చించకుండానే సర్కారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు మనంతట మనమే అయాచితంగా అస్త్రాలు అందిస్తున్నామని, వాటిని వారు సమర్థంగా మనపై ప్రయోగిస్తుంటే ఏం చేయాలో తెలియని నిస్సహాయస్థితిలో పడిపోవటం అందరికీ అనుభవమే అన్నారు.
త్వరలో సహకార, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సమయంలో, వచ్చే ఏడాది అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలున్న సమయంలో, ఏ చిన్న అంశం అందివచ్చినా అనుకూలంగా మలచుకోవటానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పేద ప్రజలకు భారంగా పరిణమించే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటుంటే, పార్టీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, పార్టీ నాయకత్వ సమర్థతను ప్రజల వద్దకు వెళ్లి తెలియజేయాల్సిన కాంగ్రెస్ శ్రేణులు ఆత్మరక్షణలో పడిపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం, పార్టీ రెండూ రెండు చక్రాలుగా ముందుకు నడవాల్సిన పరిస్థితిలో పార్టీతో నిమిత్తం లేదన్న తీరులో ప్రభుత్వం వ్యవహరించటం వల్ల కలిగే అనర్థాలు తన కంటే పిసిసి అధ్యక్షుడికే ఎక్కువగా తెలుసన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయని, ఇవి కార్యరూపం దాల్చితే ప్రజలపై చావు దెబ్బపడినట్టేనని స్పష్టం చేశారు. సర్చార్జీల పేరిట ఇప్పటికే మూడేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.7 వేల కోట్ల భారం పడిందని, తాజా పెంపు భారం సుమారు రూ.13 వేల కోట్ల భారం పడుతుందన్నారు.