సిఎం పోస్టుకు ఎసరు: శాపగ్రస్త జిల్లాకు జగదీష్ శెట్టార్
ఫలితంగా ఐదేళ్ల నుంచి ఏ ముఖ్యమంత్రి అక్కడ పర్యటించలేదు. కర్ణాటకలో శాపగ్రస్త జిల్లాగా పేరుగాంచిన చామరాజనగర్కు మూఢ నమ్మకాన్ని పక్కన పెట్టి మరీ జగదీశ్ శెట్టర్ విచ్చేశారు. బెంగళూరు నుంచి బుధవారం మలై మహదేశ్వర కొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని మహదేశ్వరుడికి పూజలు నిర్వహించి, చామరాజనగర్ చేరుకున్నారు. ఆయన మొరార్జీ వసతి పాఠశాల, ప్రైవేట్ బస్స్టేషన్, కమర్షియల్ కాంప్లెక్స్, సమాచార భవనం, పశువైద్యశాల, నవోదయ విద్యాలయంలో విశ్రాంతి భవనం, బయోగ్యాస్ విభాగంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
పలు శంకుస్థాపనలు చేశారు. గతంలో 2008 మేలో అప్పటి సిఎం హెచ్డి కుమార స్వామి చామరాజనగర్ను సందర్శించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో చామరాజనగర్పై మూఢనమ్మకానికి మరింత ఊతమిచ్చినట్లయింది. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్.ఆర్.బొమ్మై, వీరేంద్ర పాటిల్ చామరాజనగర్ జిల్లాలో పర్యటించారు. తర్వాత ఐదారు నెలల్లోనే వారంతా పదవులను కోల్పోయారు.
మహదేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం జగదీశ్ శెట్టర్ విలేకరులతో మాటాడారు. స్వామి ఆశీర్వాద బలంతో తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు. చామరాజనగర్ పుణ్యభూమి అని, తాను మంత్రిగా ఉన్న కాలంలో పలుమార్లు ఇక్కడికి వచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.