జార్ఖండ్లో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు
జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) మద్దతు ఉపసంహరణ దరిమిలా అర్జున్ ముండా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేసిన నేపథ్యంలో జార్ఖండ్లో తాజా రాజకీయ పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ ఓ నివేదిక సమర్పించారు. రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన సిఫారసు చేశారు. జార్ఖండ్ గవర్నర్ ప్రాథమిక నివేదిక పంపిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ద్రువీకరించారు. దానిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు వీలుగా శాసనసభను రద్దు చేయాలని గవర్నర్కు అర్జున్ ముండా సిఫార్సు చేశారు. ఆ సిఫార్సును గవర్నర్ ఆమోదించలేదు. కాంగ్రెసు ఇంత వరకు సభను రద్దు చేయాలని కోరలేదు. అలా అని ప్రభుత్వ ఏర్పాటుకూ చొరవ చూపడం లేదు. 2006 బిజెపిని గద్దె దించాలన్న లక్ష్యంతో జెఎంఎంతో కలిసి మధుకొడాకు మద్దతిచ్చింది. దాంతో అక్కడ కాంగ్రెసు - జెఎంఎం ప్రభుత్వం ఏర్పాటయింది.
అవినీతి కోణాలు బయటపడిన తర్వాత కాంగ్రెసు అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీంతో మరోసారి జెఎంఎంతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెసు సుముఖంగా లేదు. తాజాగా గవర్నర్ సిఫార్సు నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.