తలల నరికివేత: కొడుకునూ ఆర్మీలోకి పంపిస్తానన్నతల్లి
హేమరాజ్ 2001లో ఆర్మీలో చేరారు. భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు(ప్రిన్స్), ఇద్దరు సోదరులతో కలిసి ఉంటున్నాడు. తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడు. హేమరాజ్ చనిపోవడంతో ఆ కుటుంబం ధైర్యంగా పాక్ సైనికులను తుదముట్టించేందుకు ప్రిన్స్ను కూడా ఆర్మీలోకి పంపిస్తామని చెప్పడం గమనార్హం. ప్రిన్స్ వయస్సు ప్రస్తుతం ఐదేళ్లు. ఇక సుధాకర్ సింగ్ మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లా దర్హియా గ్రామస్థుడు.
ఇతను 2002లో ఆర్మీలో చేరారు. వీరిద్దరూ 13 రాజ్ పుటానా రైఫిల్స్ దళానికి చెందిన జవాన్లు. హేమరాజ్, సుధాకర్ సింగ్ల మృతదేహాలను తొలుత పూంచ్ జిల్లా నుంచి రాజౌరికి సైనిక లాంఛనాలతో తరలించారు. అక్కడి నుండి హెలికాప్టర్లో జమ్మూ విమానాశ్రయానికి, అక్కడి నుండి ఢిల్లీకి తరలించారు. కాగా సుధాకర్ సింగ్ తల ఇంకా దొరకలేదు. సుధాకర్ సింగ్కు భార్య, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు.
ఆధారాలున్నాయి
భారత జవాన్ల పైన తాము దాడి చేయలేదన్న పాకిస్తాన్ వ్యాఖ్యల్ని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ తోసిపుచ్చారు. ఇద్దరు జవాన్లను హతమార్చి, మృతదేహాలను ఛిన్నాభిన్నం చేయడం వెనుక పాక్ హస్తమున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అమానవీయంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. భారత్ను రెచ్చగొట్టేందుకే ఈ దారుణానికి పాల్పడుతోందన్నారు. మరోవైపు అది తమ పని కాదని పాకిస్తాన్ కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోంది.