తప్పుడు ప్రచారం: నరికివేతపై హీనా, పక్కా వ్యూహంతో
ఇప్పటికే ఇద్దరు భారత జవాన్ల తలలు తెగనరికిన పాకిస్తాన్ సైన్యం ఎల్వోసీ వద్ద గురువారం మళ్లీ దుస్సాహసం చేసింది. మూడు భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం తమ సైనికున్ని కాల్చి చంపాయని ఆరోపిస్తూ ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడింది. మరోవైపు ఇప్పటికే ఉగ్రవాదుల కబంద హస్తాల్లో చిక్కుకుని సతమతమవుతున్న పాకిస్థాన్ ఆ ఉచ్చు నుంచి బయటపడటానికే కాశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తేవాలని చూస్తోందని భారత రక్షణ, దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ ఇద్దరు జవాన్లను ఊచకోత కోయడం ద్వారా దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు పాక్ ఎత్తుగడ వేసిందని, ఇటీవల తరచుగా కాల్పులకు తెగబడుతూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు వీలు కల్పించేలా పన్నాగం పన్నిందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఊచకోత ఘటనపై ఐక్య రాజ్య సమితి నేతృత్వంలో విచారణ జరగాలని పాక్ విదేశాంగమంత్రి హీనా రబ్బానీ పిలుపునివ్వడమే ఇందుకు నిదర్శనమంటున్నాయి.
జవాన్ల ఊచకోతతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని, ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో విచారణకు తాము సిద్ధమని పాక్ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిపాదనను భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి భారత్ అంగీకరించదని, ఐక్య రాజ్య సమితి విచారణకు తావు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం స్పష్టం చేశారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు జవాన్ల ఊచకోత ఘటనకు కొద్ది రోజుల క్రితమే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. పాక్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇరుదేశాల ప్రభుత్వాలతో చర్చలు జరపాలని అమెరికా, ఐక్య రాజ్య సమితి ఇరుదేశాల తమ రాయబారులకు సూచించింది.
గేట్లు మూసిన పాక్
జవాన్ల ఊచకోతతో ఇరుదేశాల మధ్య ఉధ్రిక్తత పెరగడంతో ఎల్వోసీ వద్ద పాక్ గేట్లు మూతపడ్డాయి. పూంచ్ జిల్లా సరిహద్దుల్లో గల చంకన్-ద-భాగ్ ప్రవేశ మార్గాన్ని పాక్ మూసివేసింది. ఇరు దేశాల్లోకి ట్రక్కుల రవాణా కోసం ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు. అయితే పాక్ వైపున ఉన్న గేట్లను మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇది ఇరుదేశాల మధ్య వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. కాగా, పంజాబ్ సరిహద్దుల్లోని మరో ప్రవేశమార్గంలో మాత్రం రాకపోకలు కొనసాగుతున్నాయి.