అక్బర్ను ప్రశ్నిస్తున్న పోలీసులు, సుమన్ను కూడా..
అక్బరుద్దీన్ వ్యక్తిగత వైద్యుడు, న్యాయవాది సమక్షంలో సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ జరగనుంది. అక్బరుద్దీన్ను ఐదు రోజుల పాటు కస్డడీలోకి తీసుకుని విచారించాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ను నిర్మల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, భూకబ్జా కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు సుమన్ రాథోడ్ను హైదరాబాదులోని కూకట్పల్లి పోలీసులు శనివారం విచారిస్తున్నారు. ఆమె శుక్రవారం మియాపూర్ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. కోర్టుల్లో ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఆమె లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో ఆరో ఫేజ్లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.