28లోగా తెలంగాణ: బలరాం, ఒత్తిడికి ధర్నా: నారాయణ
అలా అయితే కాలం చెల్లినట్లే
నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామన్న కాంగ్రెసు పార్టీ వాగ్ధానం మరో ఎత్తుగడే అయితే ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఈ నెల 19వ తేదిన ఇందిరాపార్కు వద్ద సామూహిక ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ధర్నాకు సంబంధించిన పోస్టరును నారాయణ విడుదల చేశారు. ఒత్తిడి పెంచేందుకే ధర్నా అన్నారు.
ధర్నాకు తెలంగాణకు అనుకూలంగా ఉన్న అన్ని పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసులను మాత్రం ఆహ్వానించడం లేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయమే అన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని కూడా ఈఆర్సి చైర్మన్కే ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈ నంల 22న పది వామపక్ష పార్టీలతో కలిసి అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు.
రాష్ట్రం ఇస్తారని నమ్మకం లేదు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్ వేరుగా అన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఈ నెల 28న రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఇదే అంశంపై ప్రజల్ని అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో ఈ నెల 15 నుంచి టఫ్ నేతృత్వంలో ఆందోళన చేస్తామన్నారు.