కామెంట్లు-కౌంటర్లు: సీమాంధ్ర వర్సెస్ తెలంగాణ నేతలు
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలో కూడా తెలంగాణ అంశంపై వాదనలు, ప్రతివాదనలు ఊపందుకున్నాయి. తెలంగాణ రాకముందే హైదరాబాదులో తమ పరిస్థితి ఇలా ఉందని, ఇక రాష్ట్రం వస్తే ఎలా ఉంటుందోనని సీమాంధ్ర నేతలు కేంద్రంపై తెలంగాణ రాకుండా పరోక్షంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
సీమాంధ్రుల కుట్రపై గవర్నర్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, ఆ సమాచారం తన వద్ద ఉందని, అవసరమైతే దానిని బయటపెడతానన్నారు. హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకే సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకున్నారని ఆరోపించారు. నాగం వ్యాఖ్యలపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ కౌంటర్ వేశారు.
అల్లర్లకు సంబంధించి ఏదైనా సమాచారం నాగం వద్ద ఉంటే డిజిపికి ఇవ్వాలని, ప్రభుత్వంపై నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్లాలని నాగంకు పయ్యావుల సూచించారు. విధ్వంసాల సంస్కృతి ఎవరితో తెలుస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీయే ప్రాంతీయ, మత విద్వేషాలను రెచ్చగొడుతోందని కోడెల శివ ప్రసాద్ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెసు కుట్ర పూరితంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు.
తాము విభజనకు సిద్ధంగా లేమని, తాము గతంలో ఇచ్చిన లేఖనే ఇప్పుడు ఇచ్చామని, అలాంటప్పుడు గతంలో అడ్డుకోని వారు ఇప్పుడు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే చెయ్యెత్తి జైకొడతామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఆరుకోట్ల మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజించే సాహసం కాంగ్రెసు చేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు టిడిపిని పావుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బాబును దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. బాబును అడ్డుకంటే తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కె కేశవ రావు అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే తమది ప్రజల పక్షమే అన్నారు. తెలంగాణ వస్తే రాజీనామాలు చేస్తామన్న మంత్రులకు తాము కాగితాలు పంపిస్తామన్నారు. సీమాంద్ర నేతలు బెదిరింపులకు, సవాళ్లకు పాల్పడటం సరికాదన్నారు. తెలంగాణ ఇస్తే తాము 15 ఎంపీ స్థానాలు గెలిపిస్తామని చెబుతుంటే అక్కడి వాళ్లు సమైక్యాంధ్ర ఉంటే ఎన్ని సీట్లు గెలిపిస్తామో చెప్పడం లేదని విహెచ్ అన్నారు. వారి బలహీనత ఏమిటో దీనిని బట్టే అర్థమవుతోందన్నారు.
సీమాంధ్ర నేతలు హైదరాబాదులో సమావేశాలు పెట్టడం సరికాదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. వారి సమావేశాలు పెట్టుకోవడం చూస్తుంటే తెలంగాణ వస్తుందన్న విషయం అర్థమవుతోందన్నారు. రాయపాటి, గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో జరగనున్న సీమాంధ్ర సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.