తెలంగాణ: బాబుకు లగడపాటి 'కనువిప్పు' స్వాగతం!
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో బాబుకు 'తెలంగాణ-సమైక్యాంధ్ర'పై కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేపట్టి ఆహ్వానం పలుకుతామని మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్ మంగళవారం చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన బాబును తాము అడ్డుకుంటామని చెప్పారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతు పలికేలా కనువిప్పు కలిగే కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు, టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణలు సమైక్యాంధ్రకు అనుకూలంగా చేసిన పత్రికా ప్రకటలను ప్రదర్శిస్తామన్నారు. చంద్రబాబు చేసింది తప్పని, తన నిర్ణయాన్ని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఆయనపై, టిడిపిపై ఒత్తిడి తెస్తామన్నారు. బాబు యాత్రను అడ్డుకుంటే బట్టలూడదీసి కొడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారని, అది సరికాదన్నారు.
అఖిల పక్ష సమావేశంలో ఇచ్చిన లేఖను టిడిపి వెనక్కి తీసుకునేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొంటారన్నారు. కాగా బాబుకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు రూపొందిస్తున్న లగడపాటి రాజగోపాల్ నేరుగా చంద్రబాబును కలిసి సమైక్యాంధ్ర ఆవశ్యకత వివరించనున్నారని తెలుస్తోంది.