హేట్స్పీచ్పై టెస్ట్: అక్బరుద్దీన్ ట్విస్ట్కు పోలీసుల కౌంటర్
కోర్టు అనుమతిస్తే శాంపిల్స్ను ఛండీగఢ్ సిఎస్ఎఫ్ఎల్కు పంపిస్తామని వారు కోర్టును కోరారు. ప్రసంగ టేపులను అక్కడకు పంపిస్తే వాయిస్ అక్బరుదో కాదో తేలుతుందన్నారు. దేశం మొత్తం మీద ఛండీగఢ్లోనే వాయిస్ రికగ్నైజేషన్ మిషన్ ఉంది. అక్కడే వాయిస్ను శాస్త్రీయంగా నిర్ధారించుకుంటారు. గతంలో అక్బరుద్దీన్ పైన దాడి జరిగిన ఘటనలో దాడికి ప్రేరేపించిన వారు ఆ సిడిలోని గొంతు తమది కాదని చెబితే పోలీసులు ఛండీగఢ్ సిఎస్ఎఫ్ఎల్లోనే నిర్ధారించారు.
కాగా నిర్మల్ బహిరంగ సభలో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన గొంతు తనది కాదని మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్న విషయం తెలిసిందే. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కేసును ఎదుర్కుంటున్న అక్బరుద్దీన్ను పోలీసులు మంగళవారంనాడు కూడా సుదీర్ఘంగా విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు విచారణ సాగింది. నిర్మల్ బహిరంగ సభ సిడీని చూపుతూ పోలీసులు ఆయన నుంచి వివిధ అంశాలను రాబట్టేందుకు ప్రయత్నించారు.
సభలో పాల్గొన్న మాట వాస్తవమేనని, అయితే సీడిల్లో గొంతు తనది కాదని ఆయన అన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అక్బరుద్దీన్ను హైదరాబాద్ తరలించాలని ఆయన తరఫు న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బాలరాజు పోలీసులను కోరారు. అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగా లేదని అంటూ అందువల్ల హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని ఓవైసీ ఆస్పత్రి వైద్యుడు మజరుద్దీన్ అలీఖాన్ సూచించారు.
అయితే, నిర్మల్ పోలీసుల కస్టడీలో ఉన్న మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు తెలిపారు. స్థానిక ఎఆర్ హెడ్ కార్వర్స్లో మూడో రోజు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత అభిరుచులు, విద్యాబోధన, రాజకీయ రంగ ప్రవేశం వటి అంశాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.
అక్బరుద్దీన్ను కోర్టు అనుమతితో పోలీసులు ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17వ తేదీ ఉదయం పోలీసులు ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. నిర్మల్ సభలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై ఆయనను నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు.