ఒకరోజు ముందే ముగిసిన అక్బరుద్దీన్ విచారణ, జైలుకు
అక్బరుద్దీన్ను భారీ బందోబస్తు మధ్య అదిలాబాద్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బందోబస్తు మధ్య అతనిని అదిలాబాద్ సబ్ జైలుకు తరలించారు. విచారణ ముగిసిన కారణంగానే ఒకరోజు ముందుగా కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసులు చెప్పారు. ఉదయం ఐదున్నర గంటలకు కోర్టులో ప్రవేశ పెట్టామని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతనిని జిల్లా జైలుకు తరలించామని చెప్పారు.
అక్బర్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆయన తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. అక్బర్ అరెస్టు అనంతరం ఆయనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని నాలుగు రోజుల క్రితం పిటిషన్ వేశారు. దానిని కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది.
వివాదాస్పద వ్యాఖ్యల సిడిపై విచారణలో అక్బర్ ఆ వ్యాఖ్యలు తనవి కావని చెప్పారు. దీంతో వాయిస్ రికార్డ్ పోల్చుకునేందుకు నిర్మల్ పోలీసులు నిన్న(మంగళవారం) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా ఈ రోజు కోర్టులో విచారణకు రానుంది. కోర్టు అనుమతిస్తే వాయిస్ శాంపిల్ను ఛండీగఢ్ పంపిస్తామని పోలీసులు కోర్టును కోరారు.