శెట్టార్పై యడ్యూరప్ప యు టర్న్: తిరిగొస్తారన్న మంత్రి
అయితే ఒక్కసారిగా యడ్యూరప్ప బిజెపి ప్రభుత్వాన్ని కూల్చే విషయంలో వెనక్కి తగ్గారు. అయితే అందుకు యడ్యూరప్ప ఓ కారణం చెబుతున్నారు. నాలుగు నెలల్లో ఎలాగూ బిజెపి ప్రభుత్వం గడువు తీరుతుందని, ఇప్పుడు ఆ శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చి ఆ నిందను తనపై వేసుకోవడం ఎందుకంటూ యడ్యూరప్ప వెనక్కి తగ్గారు. మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఆసాధ్యమన్నారు. నాలుగు నెలల ఆయుష్షున్న ఈ ప్రభుత్వాన్ని కూల్చడం ఎందుకన్నారు. ఆ నిందను తాను ఎందుకు మోయాలన్నారు. మరోవైపు ఇతర పార్టీలలోకి వెళ్లాలని భావిస్తున్న పలువురు బిజెపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో శెట్టార్ భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
దీంతో బిజెపిని వీడి.. యడ్డీ పార్టీలో చేరి.. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలు ఇష్టం చూపడం లేదు. ఈ విషయాన్ని ఆయన మద్దతుదారులు యడ్యూరప్పకు తేల్చి చెప్పారట. దీంతో అతను వెనక్కి తగ్గారని అంటున్నారు. అయితే పైకి మాత్రం బిజెపి ప్రభుత్వానికి కేవలం నాలుగు నెలలు ఉన్నందు వల్లనే వెనక్కి తగ్గానని చెబుతున్నారని అంటున్నారు.
యడ్డీ తిరిగొస్తారు
యడ్యూరప్ప తిరిగి బిజెపిలోకి వస్తారని విద్యాశాఖ మంత్రి సిటి రవి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమా భారతి వంటి ఎందరో నేతలు బిజెపిని వీడిన వారేనని, వారు తిరిగి బిజెపిలోకి వచ్చారని, ఇప్పుడు యడ్యూరప్ప కూడా తిరిగి వస్తారన్నారు.