ఆ ఎమ్మెల్యేలు జగన్ వైపు: ద్వారంపూడి, తెలంగాణపై..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. తన కార్యకర్తలను, నాయకులను సంప్రదించిన తర్వాతే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు కిరణ్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి త్వరలో వస్తారన్నారు.
కిరణ్ ప్రభుత్వంలో నియోజకవర్గ పనులేమీ జరగటం లేదన్నారు. ఏడాదిగా కిరణ్ ప్రభుత్వంలో మార్పు వస్తుందో చూస్తున్నానని అన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. హైదరాబాదులో జరుగుతున్న సమైక్యాంధ్ర సభ గురించి తనకు ఏమీ తెలియదన్నారు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడేంత పెద్ద నాయకుడిని తాను కాదన్నారు.
కాగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గత ఆదివారం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసిన అతను తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయనని ప్రకటించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశ్య పూర్వకంగా కాంగ్రెసు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజా సంక్షేమం కాంగ్రెసు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పంపినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొంగ జపాలు మాని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తానన్నారు. ఆరోపణలపై సిబిఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెసు పార్టీకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దూరమవుతారనే వార్తలు కొంతకాలంగా వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆదివారంనాడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చినప్పటికీ ఈరోజు చేరారు.