2 రాష్ట్రాలని షిండే చెప్పారు: నారాయణ, ఉత్తిదే: వినోద్
సీమాంధ్ర మంత్రులు తెలంగాణకు సహకరిస్తే చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. హైదరాబాదుకు చెందిన మంత్రుల తీరు సిగ్గుపడేలా ఉందన్నారు. ఉద్యమానికి అడ్డుపడేలా మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యం అన్నారు. ఈ నెల 20వ తేదిన సమరభేరీ మోగిస్తామన్నారు.
గన్ పార్కు వద్ద జెఏసి చేపట్టిన మౌన దీక్షకు భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. మౌనదీక్ష పోరాట దీక్ష కావాలన్నారు. తెలంగాణపై ఇక కాలాయాపన తగదన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర నేతలకు మౌనం తప్పదని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తోకలు జాడిస్తున్నారని, వారిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అదుపులో పెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రెండు రాష్ట్రాలకు కాంగ్రెసు సుముఖంగా ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారన్నారు. తన మాటలు తప్పని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి నిరూపిస్తే తల నరుక్కుంటానని, ఆయన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రసవ వేదన వంటిదన్నారు. సుఖ ప్రసవానికి అందరూ సహకరించాలన్నారు. కొందరు కాంగ్రెసు నేతలు పిండాన్నే చంపాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.