కమలానంద అరెస్ట్: పిఎస్ వద్ద స్వామిజీల జాగారం
ఆ తర్వాత వారిని విడుదల చేశారు. అయితే స్వామిజీలు మాత్రం పోలీసు స్టేషన్ వద్ద నుండి కదలలేదు. తమను ఎందుకు అరెస్టు చేశారు, ఎందుకు విడుదల చేశారని వారు పోలీసులను ప్రశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండానే కమలానందను అరెస్టు చేశారన్నారు. ఆయన కేవలం మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఉచ్చరిస్తూ వాటిని ఖండించారని, దానికే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.
కమలానంద భారతిని విడుదల చేసే వరకు తాము పోలీసు స్టేషన్ వద్ద నుండి కదిలేది లేదన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. తాము గవర్నర్ నరసింహన్, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలను కలిసి కమలానంద అక్రమ అరెస్టు గురించి వివరిస్తామన్నారు. స్వామిజీలు రాత్రంతా బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద జాగారం చేశారు. గురువారం ఉదయం కూడా వారు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
రాత్రి నుండి ఆందోళన చేస్తున్న స్వామిజీలకు భారతీయ జనతా పార్టీ నేతలు, విశ్వహిందూ పరిషత్ నేతలు మద్దతు పలికారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కమలానంద మాట్లాడుతుండగా తాను అక్కడే ఉన్నానని, ఆయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలన్నారు. కాగా స్వామిజీలకు మద్దతుగా భారీగా బిజెపి, విహెచ్పి కార్యకర్తలు తరలి వస్తున్నారు. మరోవైపు కమలానందను పోలీసులు ఈ రోజు నుండి రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.