విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు: ఉండవల్లి
నలబై ఏళ్ల కిందట ఇదే సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతమంతా జై ఆంధ్రా అంటూ ప్రత్యేక రాష్టర్ ఉద్యమ తీవ్రత బలంగా ఉన్న విషయాన్ని ఆయన తన ఆహ్వానంలో గుర్తు చేశారు. విద్యార్థులు 170 రోజులు, ఎన్జీవోలు 108 రోజుల పాటు చేసిన సమ్మెలు, హర్తాళ్, రాస్తారోకోలతో నెలల తరబడి ప్రజాజీవనం స్తంభించిపోయిందని ఆయన గుర్తు చేసారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో లాఠీచార్జీలు, అరెస్టులూ పోలీసు కాల్పులు జరగని ఊరంటూ లేదంటే అతిశయోక్తి కాదని ఆయన అన్నారు.
తాను విద్యార్థిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తాము రెండో తరగతి పౌరులుగా బతకలేమని, 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రాన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయాలని సీమాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో ఘోషించారని ఆయన అన్నారు.
జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న తాను 32 రోజులు పాటు జైలులో ఉన్నానని ఆయన చెప్పారు. 40 ఏళ్ల కిందట ఉవ్వెత్తిన ఎగసిన జై ఆంధ్ర ఉద్యమం చివరికి ఎలా ముగిసిందని ఆయన అడిగారు. మరుగున పడిపోయిన నాటి కొన్ని చారిత్రక సత్యాలను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్లో విలీనం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1973లో జై ఆంధ్ర ఉద్యమం, 2013లోని యదార్థ పరిస్థితులను సమావేశంలో వివరిస్తానని ఆయన చెప్పారు.